హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రోగి జన్యు నిర్మాణం ఆధారంగా వైద్య చికిత్సను సిఫారసు చేసేలా వైద్యులకు ఉపకరించే ఓ వేదికను ఉప్పలూరి కే హెచ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ క్లినిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించింది. వైద్యరంగంలో ఓ మైలురాయిగా నిలిచిపోయే కృత్రిమ మేధస్సుతో కూడిన వేదిక ‘జీన్కనెక్ట్ ఆర్ఎక్స్’ను ఆవిష్కరించారు. ఇది కృత్రిమ మేధస్సుతో వ్యాధులను సమగ్రంగా అధ్యయనం చేసి సరైన ఔషధాలను సూచించే సరికొత్త పరిజ్ఞానమని డాక్టర్ కల్యాణ్ ఉప్పలూరి తెలిపారు. ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ ప్లాట్ఫామ్ అయిన జీన్కనెక్ట్ ఆర్ఎక్స్ను ప్రముఖ వైద్యుల సమక్షంలో ఆవిష్కరించారు. కల్యాణ్ ఉప్పలూరి మాట్లాడుతూ వైద్య రంగంలోనూ కృత్రిమ మేధస్సును సమర్థంగా వినియోగించేందుకు అవకాశం ఉందని గుర్తించిన తమ సంస్థ ఏఐ ఆధారంగా పనిచేసే జీన్కనెక్ట్ ఆర్ఎక్స్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. మెదడు క్యాన్సర్, మోనోజెనిక్ మధుమేహం, పార్కిన్సన్స్ వ్యాధి, అధిక కొలెస్ట్రాల్, ఆటిజం వంటి వ్యాధుల చికిత్సకు రోగి జన్యువులను బట్టి ఎలాంటి ఔషధాలను వాడాలో సూచిస్తుందని పేర్కొన్నారు. ప్రముఖ దవాఖాన ఏఐజీతో కలిసి ఫార్మకోజెనోమిక్స్ అధ్యయం చేపట్టామని, దాని ద్వారా జీన్కనెక్ట్ ఆర్ఎక్స్ను రూపొందించామని డాక్టర్ హిమ చల్లా తెలిపారు. కార్యక్రమంలో ఏఐజీ దవాఖాన చైర్మన్ అండ్ చీఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పద్మభూషణ్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ పెన్మత్స వెంకటసుబ్బరాజు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.