న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ, మార్చి 19: రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పంటలన్నీ దెబ్బతిన్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు కురిసిన వడగండ్ల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలవాలడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవె న్యూ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టాలను అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 32 ఇండ్లు నేలమట్టమయ్యాయి.
ఆళ్లపల్లి మండలం సింగారం పంచాయతీ పరిధిలోని సందిబంధం గ్రామంలో పిడుగుపాటుకు 15 ఎడ్లు మృత్యువాత పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 165 ఎకరాల్లో ఉద్యాన పంటలైన మామిడి, బొప్పాయి, జీడి మామిడి, టమాటా తోటలు దెబ్బతిన్నాయి. ఒక్క ఇల్లెందు మండలంలోనే 480 ఎకరాల్లోని పంట దెబ్బతిన్నది. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని కోడేరు, జనుంపల్లి, ఎత్తం, నర్సాయపల్లి, నాగులపల్లి, మైలారం, కొండ్రావుపల్లి గ్రామాల్లో అత్యధికంగా మామిడి తోటలు దెబ్బతిన్నాయి. చాలా గ్రామాల్లో మామిడి చెట్లు విరిగి పడ్డాయి. ఒక తోటకు రూ.4 లక్షల వరకు యజమానికి చెల్లించానని, కాయలు నేలరాలడంతో నష్టం జరిగిందని కొల్లాపూర్కు చెందిన కౌలురైతు వాపోయాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగు పడి పాడి గేదెలు మృతి చెందాయి.
పలు చోట్ల ఇండ్లు నేలమట్టమయ్యాయి. మిర్చి, వరి, మొక్కజొన్న, పుచ్చకాయ, బొప్పాయి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గూడూరు మండలం చిన్నఎల్లాపురం గ్రామ పరిధిలోని హాము తండాలో చెట్టు విరిగి గుడిసెపై పడగా ధరంసోత్ శంకర్ మృతి చెందాడు. జిల్లాలో 43,424 మంది రైతులకు చెందిన 57,855 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యాప్తంగా ఈదురు గాలులుతో కూడిన వర్షానికి మామిడి, వరి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, గజ్వేల్, గజ్వేల్రూరల్, జగదేవ్పూర్, నారాయణరావుపేట, బెజ్జంకి, హుస్నాబాద్ రూరల్, హుస్నాబాద్ టౌన్, కొమురవెల్లి, కోహెడ, తొగుట, రాయపోల్ మండలాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, మామిడి, కూరగాయ పంటలకు నష్టం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వడగండ్ల వానతో 175 మంది రైతులకు చెందిన 307 ఎకరాల్లో వరి, మక్క, నువ్వుల పంటలకు నష్టం వాటిల్లింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి, చందూర్తండా, మాటేడు, పోలేపల్లి, పెద్దవంగర, జనగామ జిల్లా కొడకండ్ల మండలాల్లో దెబ్బతిన్న వరి, మక్కజొన్న, మిర్చి, మామిడి తోటలను ఆయా కలెక్టర్లు శశాంక, శివలింగయ్యతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని, నివేదిక రాగానే పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం పంట నష్టాన్ని అం చనా వేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగండ్లు హడలెత్తిస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జా ర్ఖండ్ వరకు, రాయలసీమ, ఒడిశాల మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.