మంచిర్యాల : క్యాతన్పల్లి ( Kyathanpally ) మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ ( Congress ) పార్టీ అరాచక పర్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. బీఆర్ఎస్ నాయకులపై లాఠీఛార్జి చేసి, తప్పుడు కేసులు పెట్టి బాల్కసుమన్ సహా పలువురిని జైలుకు పంపించినా అధికార పార్టీకి ఇంకా సంతృప్తి కలగలేదు. మంత్రి వివేక్ ( Minister Vivek ) కు క్యాతన్పల్లి జనాలపై కోపం పోలేదు. ప్రలోభపెట్టాలని చూసినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు తలొగ్గకపోవడంతో అధికార బలాన్ని ఉపయోగించి భయబ్రాంతులకు గురిచేసే చర్యలకు తెరలేపారు.

క్యాతన్పల్లి మున్సిపాలిటీ 11వ వార్డులో బీఆర్ఎస్ నుంచి బొమ్మ భీమయ్య గౌడ్ ( Councillor Bhemaiah Goud ) ఇటీవలే కౌన్సిలర్ గా గెలుపొందారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ క్యాంప్లో ఉండగా ఆయన నివాసానికి శుక్రవారం సింగరేణి సెక్యూరిటీ అండ్ పర్సనల్ కంట్రోల్ అధికారులను పంపించి భూమయ్య గౌడ్ భార్య, ఆయన కూతురును భయబ్రాంతులకు గురిచేసింది కాంగ్రెస్ సర్కార్.

గత కొన్నేళ్లుగా ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో టెంట్ హౌజ్ సామగ్రి పెట్టుకున్న భూమయ్యగౌడ్ ఇంటిని శుక్రవారం సాయంత్రం చుట్టుముట్టి అల్లకల్లోలం సృష్టించారు. ఇది సింగరేణి స్థలమని అందులో ఉన్న సామగ్రి మొత్తం తీసుకెళ్తామంటూ హడావుడి చేశారు. ఖాళీ స్థలంలో ఉన్న టెంట్ హౌజ్ సామగ్రిని చిందరవందరగా పడేసి నానా బీభత్సం సృష్టించారు.
అధికారుల ప్రవర్తనతో భయపడిపోయిన కౌన్సిలర్ భీమయ్య గౌడ్ భార్య ఏడుస్తూ.. మా ఆయన లేరు ఇప్పటికిప్పుడు సామగ్రి తీసేందుకు ఎవరూ లేరంటూ బతిలాడినా వినిపించుకోలేదు. ఆమె అరుపులు, ఏడుపులు విని స్థానికులు గుమిగూడటంతో రేపటిలోపు సామగ్రి అంతా తీయాలని లేనిపక్షంలో మొత్తం తీసుకెళ్తామంటూ హెచ్చరించారు. ఆ స్థలంలో ఆరబోసిన వడ్ల కుప్పను సైతం తీసేయాలంటూ హుకుం జారీ చేశారు. ఇంటికి కొద్ది దూరంలో ఇది సింగరేణి స్థలం అంటూ బోర్డు ఏర్పాటు చేశారు.
తన భర్త కౌన్సిలర్గా కావాలనే ఉద్దేశ పూర్వకంగా ఇలా చేస్తున్నారని భార్య విజయ ఆరోపించారు. అక్కడికి చేరుకున్న జర్నలిస్టులు ఏం చేస్తున్నారని సింగరేణి అధికారులను ప్రశ్నించగా సింగరేణి స్థలాన్ని ఆక్రమించారు. స్వాధీనం చేసుకుంటున్నామంటూ సెలవిచ్చారు. ఎప్పుడు ఆక్రమించారంటే సరైన సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి జారుకున్నారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారని కూడా చూడకుండా దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదని స్థానికులు పేర్కొన్నారు.