హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ దురలవాటుతో తలెత్తే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా శ్వాసనాళాలు, ఊపిరితిత్తులను దారుణంగా దెబ్బతీసే ఈ వ్యసనం వల్ల ఎముకలకు సైతం తీవ్రమైన ముప్పు తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. పొగరాయుళ్లలో ఎముకలు గుల్లబారటం, విరగటం లాంటి సమస్యలు అధికంగా ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ నెవాడా, లాస్ వెగాస్ (యూఎన్ఎల్వీ) స్పష్టం చేసింది.
మొత్తం 27 పరిశోధనలను విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే పొగరాయుళ్లలో ఎముకలు గుల్లబారి తర్వగా విరిగిపోయే అవకాశాలు 37% ఎక్కువని వెల్లడించింది. ధూమపానంతో తుంటి, మణికట్టు, భుజాలు, కాళ్లు, వెన్నెముక లాంటి భాగాలకు ముప్పు తప్పదని, తుంటి విరిగే ముప్పు 30%, వెన్నెముక విరిగే ముప్పు 40% అధికమని హెచ్చరించింది. ఎముకలు విరిగిన పొగరాయుళ్లలో 21-37 శాతం మంది ఏడాదిలోపే మరణిస్తున్నట్టు తెలిపింది. సాధారణంగా ఎముకలు గుల్లబారటం పురుషుల కన్నా మహిళల్లో ఎక్కువ. కానీ, ధూమపానం వల్ల పురుషులకూ ఈ ముప్పు పెరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సిగరెట్లలోని రసాయనాలు ఎముక కణాలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని, ప్రత్యేకించి కాల్షియం, డీ విటమిన్ను శరీరం సరిగా సంగ్రహించుకోకుండా అడ్డుపడి ఎముకల పటుత్వాన్ని దెబ్బతీస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధూమపానాన్ని మానుకోవటం మంచిదని యూఎన్ఎల్వీ పరిశోధకులు సూచిస్తున్నారు.