టొరంటో: క్యాన్సర్పై పోరాటంలో కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త విధానాన్ని నివేదించారు. క్యాన్సర్ కణితుల్లోకి ఓ రకం బ్యాక్టీరియాను పంపి వాటిని ధ్వంసం చేసే విధానంపై అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు. శరీరం లోపల బాగా గట్టిపడిన క్యాన్సర్ కణితుల్లో ఏర్పడే బలహీనతను కనుగొని దాని లక్ష్యంగా బ్యాక్టీరియా పంపి చికిత్సనందించే విధానంపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. సాధారణంగా శరీరం లోపల క్యాన్సర్ కణితుల్లోని కణాలు వేగంగా పెరుగుతాయి. ఈ క్రమంలో రక్తప్రసరణ జరుగక చాలావరకు కణాలు నశించిపోతాయి. దీంతో కణితుల్లోని ఆ భాగానికి ఆక్సిజన్ అందదు.
ఆ భాగం ఈ బ్యాక్టీరియా ఎదుగుదలకు అనువైన ప్రదేశమని పరిశోధకులు వివరించారు. క్లాస్ట్రిడియం స్పోరోజీన్స్ బాక్టీరియా మట్టి లోపలి పొరల్లో లభిస్తుంది. ఇది ఆక్సిజన్ లేని ప్రదేశాల్లో మాత్రమే మనగలుగుతుంది. ఒక్కసారి ఈ బ్యాక్టీరియా క్యాన్సర్ కణితి లోపలి భాగంలోకి వెళ్లగానే అది వేగంగా వృద్ధి చెంది లోపలి నుంచే క్యాన్సర్ కణజాలాన్ని ధ్వంసం చేస్తుందని వివరించారు. క్లాస్ట్రిడియం స్పోరోజీన్స్ అనే బాక్టీరియా ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో మాత్రమే అది పనిచేస్తుంది.
ఒక్కసారి అది క్యాన్సర్ కణితిని లోపలి నుంచి ధ్వంసంచేస్తూ బయటి పొరలవైపు వచ్చినప్పుడు ఆక్సిజన్ అందగానే పనిచేయడం ఆగిపోతుంది. దీంతో క్యాన్సర్ కణితులు పూర్తిగా ధ్వంసం కావు. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అదే బాక్టీరియాకు సంబంధించిన మరో జన్యువును దానికి జోడించారు. దీంతో ఆ బ్యాక్టీరియా ఆక్సిజన్ను కూడా తట్టుకోగులుగుతున్నదని వివరించారు. అయితే తాము జోడించిన జన్యువు గనుక సదరు బ్యాక్టీరియాలో ముందస్తుగానే పనిచేయడం ప్రారంభిస్తే మానవ శరీరంలో ఆక్సిజన్ స్థాయి సమృద్ధిగా ఉండే ఇతర అవయవాల్లో కూడా జీవించగలుగుతుందని, ఈ విషయంలో జాగ్రత్త వహిస్తే క్యాన్సర్ చికిత్సకు ఇది అనువైన విధానమని వివరించారు.