హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): వరి సాగు చేసే రైతులతో కేంద్రం బంతాట ఆడుతున్నది. ఒక కేంద్ర మంత్రి వరి సాగు తగ్గించాలంటే, మరో కేంద్ర మంత్రి భారీగా పెంచాలని సూచిస్తున్నారు. సాగు చేసిన ధాన్యానికి మిల్లుల్లో మొలకలు వస్తున్నా, సీఎమ్మార్ సేకరణపై కేంద్రం నోరు మొదపటం లేదు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని సూచించినట్టు కేంద్రం స్పష్టంచేసింది. వరి సాగు నియంత్రణ, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సాహకంపై ఎంపీ రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మంగళవారం లోక్సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పథకం కింద వరి సాగును తగ్గించి పప్పులు, నూనె గింజలు, పత్తి, కూరగాయల సాగును ప్రోత్సహించాలని రాష్ర్టాలకు సూచించినట్టు వెల్లడించారు.
ధాన్యం కొనకుండా కక్షసాధింపు
మరోవైపు దేశంలో వరి సాగు తగ్గిందని, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ నెల 6న చెప్పారు. బియ్యం ఎగుమతులకు మంచి అవకాశం ఉన్నదని, రైతులను వరి సాగు చేసేలా ప్రోత్సహించాలని రాష్ర్టాలకు సూచన చేశారు. దీన్నిబట్టి వ్యవసాయవిధానంలో, మార్కెటింగ్లో కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేదని స్పష్టమవుతున్నది.
విదేశీ పళ్ల ఉత్పత్తికి సహకారం
దేశంలో విదేశీ పండ్లు (డ్రాగన్ ఫ్రూట్, అంజీరా) సాగును ప్రోత్సహిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. తెలంగాణలో డ్రాగన్ ఫ్రూట్, అంజీర సాగు బాగుందని చెప్పింది. 2019-20లో రాష్ట్రంలో 48 హెక్టార్లలో డ్రాగన్ ఫ్రూట్ సాగు కాగా 720 టన్నుల ఉత్పత్తి వచ్చినట్టు పేర్కొన్నది. 2021-22లో 228 హెక్టార్లలో సాగవగా 2,285 టన్నుల ఉత్పత్తి వచ్చినట్టు తెలిపింది. అంజీర పంట 2020-21లో 110 హెక్టార్లలో సాగవగా 1,610 టన్నుల ఉత్పత్తి వచ్చిందని, 2021-22లో 125 హెక్టార్లలో సాగవగా 1,607 టన్నుల ఉత్పత్తి వచ్చినట్టు వెల్లడించింది.