కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డను కడతేర్చాడు. ఇప్పటికే తన భార్య ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వగా, మూడో కాన్పులోనూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న తండ్రి తన మూడో కూతురిని చంపేశాడు. ఈ దారుణ ఘటన కాగజ్నగర్ పరిధిలోని లెనిగూడలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
మెస్రం బాపురావు అనే వ్యక్తి తన 40 రోజుల బిడ్డను చంపేసినట్లు కాగజ్నగర్ రూరల్ పోలీసులు నిర్ధారించారు. పసిపాపను సిమెంట్ రోడ్డుపై బలంగా పడేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాపురావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.