హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): వర్సిటీల్లోని కాంట్రాక్ట్ సహ ఆచార్యులకు యూజీసీ ఏడో పీఆర్సీని అమలుచేయాలని వర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసొసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (ఉథాట్స్) ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సంఘం నేతలు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ ఏడాది నుంచి యూజీసీ ఏడో పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో ఉథాట్స్ రాష్ట్ర అధ్యక్షుడు పరశురాం, ప్రధాన కార్యదర్శి బైరి నిరంజన్ తదితరులు ఉన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై వారం రోజుల్లో అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యేందుకు విద్యాశాఖ మంత్రి సబిత హామీ ఇచ్చినట్టు ఆ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూపీఎస్సీ) నేతలు తెలిపారు.