హైదరాబాద్ : పద్దెనిమిదేండ్లకు అమ్మాయిలు వివాహం చేసుకోవచ్చని చట్టం చెబుతున్నది. ఈ నిబంధనే పైచదువులకు ప్రతిబంధకంగా మారుతున్నది. 18 ఏండ్లు నిండగానే పెండ్లిళ్లు చేయడం, బరువు బాధ్యతలతో చదువును కొనసాగించలేకపోతున్నారు. ముఖ్యంగా పిల్లలకు జన్మనివ్వడం, పెంచడంలో నిమగ్నమవుతుండడంతో మధ్యలోనే వదిలి వేయాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, యూనివర్సిటీల్లోని అమ్మాయిలకు ఇస్తున్న మెటర్నిటీ సెలవులను పెంచే అంశాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పరిశీలిస్తోంది.
ప్రస్తుతం అమలుచేస్తున్న 12 వారాల స్థానంలో 240 రోజుల పాటు ప్రసూతితోపాటు, చైల్డ్కేర్ లీవ్స్ను ఇచ్చే అంశాన్ని యూజీసీ పరిశీలిస్తున్నది. మహిళా ఉద్యోగుల తరహాలోనే డిగ్రీ, పీజీ కోర్సుల్లోని విద్యార్థులకు సైతం 240 రోజుల మెటర్నిటీ సెలవులిచ్చేందుకు యూజీసీ కసరత్తును చేస్తున్నది. ఇందుకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఇటీవలే అన్ని యూనివర్సిటీల వైస్ఛాన్స్లర్లను యూజీసీ ఆదేశించింది. ఇటీవలి కాలంలో ఉన్నత విద్యలో మహిళల నమోదు పెరుగుతున్నది. వివాహమైన తర్వాత సైతం మహిళలు చదివేందుకు ఇష్టపడుతున్నారు.
ఈ క్రమంలో కొంత మంది గర్భందాల్చడం, పిల్లల బాగోగులు చూడాల్సి ఉండడంతో చదువులకు ఆటంకం కలుగుతున్నది. హాజరుశాతం, పరీక్షలు, ప్రాక్టికల్స్ తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రసూతి సెలవులను పెంచేందుకు యూజీసీ చర్యలు చేపట్టింది. మార్గదర్శకాలు సిద్ధమైన అనంతరం అమలులోకి తేనున్నది. ఈ సందర్భంగా యూజీసీ సభ్యుడు ప్రొఫెసర్ గోపాల్రెడ్డి స్పందిస్తూ.. ‘ఇది అంతా స్వాగతించాల్సిన అంశం’ అన్నారు. ఉన్నత విద్యలో మహిళల నమోదును పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు.
ఇప్పటికే ఉన్నత విద్యలో అమ్మాయిలు, అబ్బాయిలకు ధీటుగా పోటీపడుతున్నారని, ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అబ్బాయిలకన్నా అమ్మాయిల నమోదు పెరిగిందని చెప్పారు. ఎంఫిల్ పీహెచ్డీ కోర్సుల్లోని అమ్మాయిలకు 240 రోజుల పాటు ప్రసూతి సెలవులును అమలుచేస్తున్నామని, తాజా నిర్ణయంతో డిగ్రీ, పీజీ కోర్సుల్లో వారికి సైతం ఉపశమనం కలుగుతుందని తెలిపారు.