హనుమకొండ చౌరస్తా : బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని ( Ugadi Panchagam ) వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ( MLA Ragendhar Reddy ) ఆదివారం ఆవిష్కరించారు.
క్యాంపు కార్యాలయంలో బ్రాహ్మణ సేవా సమితి ( Brahmin Seva Samithi ) వ్యవస్థాపకులు గంగు ఉపేంద్రశర్మ, బ్రాహ్మణ సేవా సమితి రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ అయినవోలు వెంకట సత్యమోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుదిమల్ల శ్రీనివాసాచార్యులు, లలిత గాయత్రి సేవా సహకార సంస్థ నాయకులు చకిలం సుధాకర్రావు పంచాంగ సిద్ధాంతకర్త వి.బాలకృష్ణశర్మ, దశమహావిద్య ఉపాసకులు పంచాంగకర్తతో కలిపి పంచాంగావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ పంచాంగకర్తలు ప్రజల శ్రేయస్సుకు మేలుకోరి మనోబీష్టాలను నెరవేర్చేవిధంగా ఉండాలని, విభిన్నాభిప్రాయాలు ఉండకూడదని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైన పండుగలు సమ్మక్క-సారలమ్మ జాతర, బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలు ఇవే చాలా ప్రాముఖ్యమైన పండుగలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అయినవోలు వెంకట సత్యమోహన్ మాట్లాడుతూ పంచాంగాలు గుణించే సిద్ధాంతులు ఒకచోట సమావేశమై కాలానుగుణంగా సిద్ధాంతపరంగా ముహూర్తాలు పండుగల విషయంలో ఏకాభిప్రాయంతో నిర్ణయం జరగడంలేదని అన్నారు. అందరూ సిద్ధాంతులే కాని అవగాహన లోపంతో ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని రాష్ట్రస్థాయిలో ఉన్న సిద్ధాంతులు, పంచాంగకర్తలు గ్రామాల్లో ఉన్న పురోహితులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు, చాత్తాద శ్రీవైష్ణవులు, పద్మ పురోహితులు ఇతర వర్గాలు కూడా పంచాంగాలు ముద్రిస్తున్నారని, వారి పంచాంగాలను కూడా రాష్ట్ర సిద్ధాంతులు పరిగణలోకి తీసుకొని వారి అభిప్రాయాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. పండుగల విషయంలో కూడా గందరగోళాలు చెలరేగుతున్నాయని, హిందువుల పండుగల పట్ల అభిప్రాయభేదాలు ఉండకుండా పంచాంగాలు ముద్రించాలని సూచించారు.