హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): మన దేశం నుంచి 2030 నాటికి రెండు ట్రిలియన్ యూఎస్ డాలర్ల (రూ.16.19 లక్షల కోట్లు) ఎగుమతి లక్ష్యాలను కేంద్రం నిర్దేశించుకున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి ఫహద్ అహ్మద్ఖాన్ సూరి చెప్పారు. ఎగుమతులకు అవసరమైన సహాయ సహకారాలు రాష్ర్టానికి అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో ఆదివారం రెడ్హిల్స్లోని ఎఫ్టీసీసీఐ కార్యాలయంలో నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
ఎగుమతిదారుల సామర్థ్యాన్ని పెంచడం ఎంతో కీలకమని, దీనికి ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. విదేశీ వాణిజ్యంలో దేశం ఎంతో పురోగతి సాధిస్తున్నదని, గత ఆర్థిక సంవత్సరంలో సరుకులు, సేవల ఎగుమతులు 670 బిలియన్ డాలర్లను అధిగమించినట్టు తెలిపారు. ఇది గత ఏడాదితో పోల్చుకుంటే 35 శాతం అధికమని పేర్కొన్నారు. పరిశ్రమల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకున్నట్టు ఆయన చెప్పారు.