వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మరో రెండు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు మంజూరైనట్లు సీపీ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు. ఒకటి కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్, మరొకటి జనగామ వద్ద ఏర్పాటు చేయనున్నట్టు సీపీ తెలిపారు. స్టేషన్ ఘన్పూర్, పరకాల, నర్సంపేట పోలీసు స్టేషన్ల పరిధిలో కూడా ట్రాఫిక్ వింగ్స్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని సీపీ పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు సోమవారం హన్మకొండ పోలీసు స్టేషన్ నుంచి సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. దీంతో పాటు హన్మకొండ అశోక జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టి ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆదేశించినట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లు లేని యెడల తక్షణమే జరిమానా విధించాలని ట్రాఫిక్ పోలీసులకు సీపీ ఆదేశాలు జారీ చేశారు. గతేడాది వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 386 మంది రోడ్డుప్రమాదాల్లో చనిపోయినట్లు పేర్కొన్నారు.
బైక్ ర్యాలీలో సెంట్రల్ జోన్ డీసీపీ కే పుష్పా రెడ్డి, హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ బాలస్వామి, హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ వేణుమాధవ్తో పాటు ప్రొబేషనరీ ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.