ఢిల్లీ, మార్చి 18 (నమస్తే తెలంగాణ): వేర్వేరు హైకోర్టులకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాక రాష్ట్రపతి ఈ మేరకు బదిలీలను ఖరారు చేసినట్టు తెలిపింది. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ సుజయ్ పాల్, కలకత్తా హైకోర్టుకు చెందిన జస్టిస్ మౌశుమి భట్టాచార్య తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. న్యాయవాదిగా ఉన్న తన కుమారుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నందున తనను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని జస్టిస్ సుజయ్ పాల్ ఫిబ్రవరి 12న సుప్రీంకోర్టు కొలీజియంకు విజ్ఞప్తి చేశారు. జస్టిస్ మౌశుమీ భట్టాచార్య కూడా వ్యక్తిగత కారణాల రీత్యా తనను కూడా బదిలీ చేయాలని కోరారు. మరింత మెరుగైన న్యాయ ప్రయోజనాల కోసం జస్టిస్ సుజయ్పాల్ను, జస్టిస్ మౌశుమీ భట్టాచార్యను బదిలీ చేయాలని సిఫారసు చేసినట్టు సుప్రీంకోర్టు కొలీజియం తెలిపింది. కొలీజియం సిఫారసులకు అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.