భీమదేవరపల్లి, మార్చి 5: గ్రామాభివృద్ధికి సర్పంచ్ దంపతులు నడుం బిగించారు. పల్లె ప్రగతి కోసం చేయి కలిపారు. గ్రామంలో నిర్మించే వైకుంఠధామం పనులకు కూలీలుగా మారారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని విశ్వనాథకాలనీ కొత్తగా ఏర్పడ్డ పంచాయతీ. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా ఆరు నెలల క్రితం వైకుంఠధామం నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు. భారీ వర్షాల కారణంగా అప్పటిదాకా చేపట్టిన కట్టడం కొట్టుకుపోయింది. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇటీవల మళ్లీ వైకుంఠధామం పనులు చేపట్టేందుకు సిద్ధపడినా.. పునాదులు తీయడానికి కూలీలు దొరకలేదు. దీంతో సర్పంచ్ వల్లెపు అనిత తన భర్త రమేశ్తో కలిసి శుక్రవారం స్వయంగా రంగంలోకి దిగి పనులు చేపట్టారు. పార, గడ్డపార పట్టి పునాది తవ్వారు. సర్పంచ్ దంపతులే కూలీలుగా మారి పనులు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారంటూ పలువురు గ్రామస్థులు వారి సంకల్పాన్ని మెచ్చుకున్నారు.