కొత్తగూడెం క్రైం, మార్చి 17: ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు దళ కమాండర్లు మృతి చెందినట్టు తెలిసింది. అందిన సమాచారం మేరకు.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు గాలింపు చేపట్టాయి. హెగ్మట అటవీ ప్రాంతంలో సుమారు 25 మంది సాయిధ మావోయిస్టులు తారసపడి, జవాన్లపై కాల్పులు జరిపారు. జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పులు సుమారు 30 నిమిషాలపాటు సాగాయి. మావోయిస్టులు పారిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని జవాన్లు విస్తృతంగా గాలించారు. ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను, వారికి చెందిన ఆయుధ, వస్తు సామగ్రిని స్వాధీనపర్చుకున్నట్టు సమాచారం. మృతులు ఇంద్రావతి ఏరియా దళ కమాండర్ మల్లేశ్, మాడ్ డివిజన్ కమిటీ కంపెనీ కమాండర్ అరుణ్ అలియాస్ రూపేష్గా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. కాంకేర్ జిల్లాలో శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టును దళ కమాండర్ మన్కేర్గా గుర్తించినట్టు అక్కడి పోలీసులు తెలిపారు.