హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే 143 (టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఆదివారం ఉప్పల్ భగాయత్లోని యూనియన్ కార్యాలయ స్థలంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించాలని తీర్మానించారు. యూనియన్ ఆఫీసుకు స్థలం కేటాయించిన గత కేసీఆర్ ప్రభుత్వానికి రాష్ట్ర కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి యూనియన్ పక్షాన అభినందనలు తెలుపుతూ.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన జర్నలిస్టు సంక్షేమ అంశాలపై సీఎం రేవంత్రెడ్డితో చర్చించి వాటి సాధనకు కృషి చేస్తామని తెలిపారు. హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆరోగ్య భద్రతకు రూ.10 లక్షల హెల్త్ కార్డు ఇవ్వాలని, నగదు రహిత హెల్త్ కార్డులు చలామణి అయ్యేలా చూడాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో ని అన్ని జిల్లాల్లో ఫిబ్రవరి 29లోపు నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని సంఘం నేతలకు సూచించారు. మార్చిలో రాష్ట్ర మహాసభ ఉంటుందని వెల్లడించారు. యూనియన్ కార్యాలయ నిర్మాణం కోసం ట్రస్ట్ను ఏర్పా టు చేసుకుందామన్నారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, ఉపాధ్యక్షులు రమేశ్ హజారే, బీఆర్ లెనిన్, అబ్దుల్లా, ఆదినారాయణ, తెమ్జు ప్రధాన కార్యదర్శి రమణకుమార్, ఐజేయూ జాతీయ కార్యదర్శి రాజమౌళి చారి, కార్యవర్గ సభ్యులు అవ్వారీ భాసర్ పాల్గొన్నారు.
తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (తెమ్జు) రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ విష్ణువర్ధన్రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా టీయూడబ్ల్యూజే నేతగా కొనసాగారు. హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్న పీ యోగానందం యూనియన్ రాష్ట్ర కోశాధికారిగా ఎన్నికయ్యారు.