కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ పట్టణంలో టీటీడీకి కెటాయించిన 10 ఎకరాల స్థలంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తేదీని ఖరారు చేశారు. మే 31న భూమి పూజను నిర్వహిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) తెలిపారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, టీటీడీ స్థానిక సలహా మండలి అధ్యక్షుడు భాస్కర్రావుతో కలిసి శుక్రవారం తిరుమలలోని టీటీడీ(TTD) పరిపాలన భవనంలో ఈవో ధర్మారెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరారు.
కరీంనగర్ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి(Venkateshwar Swamy) ఆశీస్సులు మెండుగా ఉండేలా టీటీడీ అద్భుతంగా ఆలయాన్ని నిర్మించాలని వారు కోరారు. భూమి పూజకు ముందుగా మే 22న టీటీడీ అర్చకులు భూకర్షణం నిర్వహిస్తారని ఈవో తెలిపారు. గర్భాలయ స్థలాన్ని నాగలితో దున్ని, నవధాన్యాలు చల్లుతారని, ధాన్యాలు మొలకెత్తిన తరువాత గోవులకు ఆహారంగా వినియోగిస్తారని వివరించారు. ఆ తరువాత చదును చేసి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని వెల్లడించారు.
31వ తేదీ భూమి పూజ ముగిశాక అదే ప్రాంగణంలో సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తామని మంత్రి ఈవోకు తెలిపారు. ఈ కార్యక్రమంలో
జేఈవో లు సదా భార్గవి, వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు, ఈఈ నరసింహమూర్తి, ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.