హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో నిరుపేద విద్యార్థులు అద్భుతాలను సృష్టిస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. జాతీయస్థాయి పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే వేలాది మంది పేద విద్యార్థులు జాతీయస్థాయి అకాడమీల్లో విద్యనభ్యసిస్తున్నారు. తాజాగా రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విద్యార్థి ఉమాకాంత్.. పైలట్గా ఎంపికవడం ఇందుకు నిదర్శనం. జాతీయ సైనిక పాఠశాలలకు దీటుగా రాష్ట్రంలోని విద్యార్థులకు సైనిక శిక్షణను అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం 2017-18లో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సైనిక్ స్కూల్ను ఏర్పాటు చేసింది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు దాదాపు 560 మంది విద్యార్థులకు విద్యతోపాటు సైనిక శిక్షణను అందిస్తున్నది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థి ఆవుల ఉమాకాంత్ న్యూఢిల్లీలోని సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) జాతీయ స్థాయిలో వివిధ దశల్లో నిర్వహించిన అన్ని పరీక్షల్లో సత్తా చాటి పైలట్ శిక్షణకు ఎంపికయ్యాడు. త్వరలోనే పుణె నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పైలట్ ఆఫీసర్ శిక్షణ పొందనున్నాడు. ఇప్పటికే ఈ పాఠశాల నుంచి ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ కోర్సుకు విద్యార్థి అశోక్సాయి ఎంపికవడం విశేషం.
మంత్రి కొప్పుల అభినందనలు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ఎంపికైన సైనిక్ సూల్ విద్యార్థి ఉమాకాంత్ను సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. సీఎస్ సోమేశ్కుమార్, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్బొజ్జా, గురుకుల సొసైటీ సెక్రటరీ రోనాల్డ్రోస్ను ఉమాకాంత్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ఉమాకాంత్ను అభినందించారు. సైనిక్ స్కూల్లో పొందిన శిక్షణ వల్లే పైలట్ శిక్షణకు ఎంపికయ్యానని విద్యార్థి ఉమాకాంత్ పేర్కొన్నాడుసీఎం కేసీఆర్, అధికారులు, శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపాడు.