హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వేతన సవరణలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. ఇటీవల జరిగిన వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు రావల్సిన 82.6 శాతం డీఏ బకాయిలలో ప్రభుత్వం 31.1 శాతాన్ని మూల వేతనంలో కలిపింది. ఇంకా 51.5 శాతం డీఏ బకాయి ఉండగా.. దానిని 43.2 శాతం వద్ద స్థిరీకరించింది. వేతన సవరణ అనంతరం వచ్చే మూల వేతనంపై 43.2 శాతం డీఏను లెక్కించి జీతంతోపాటు చెల్లించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన వేతన సవరణ నిబంధనలను ఆర్టీసీకి కూడా వర్తింపజేయడంతో ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) తగ్గిపోయింది. దీంతో కొత్త జీతం ఆశించిన స్థాయిలో పెరగలేదన్న నిరాశలో ఉద్యోగులు ఉన్నారు. అయితే బకాయి పడిన కరువు భత్యాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఆ లోటు కొంతమేర తీరినట్టేనని భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ నాలుగు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం అన్ని విడతల డీఏలు చెల్లించటం విశేషం. 2024 జనవరి విడతకు సంబంధించి 3.9 శాతాన్ని కూడా తాజా వేతన సవరణలో భాగంగా చెల్లించనున్నారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఏకంగా ఏడు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉండేవి. అయితే కార్మిక సంఘాల ఒత్తిడి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృషి ఫలితంగా తకువ సమయంలోనే ప్రభుత్వం డీఏ బకాయిలను చెల్లించిందని కార్మికులు భావిస్తున్నారు.