మారేడ్పల్లి, నవంబర్ 30: రాష్ట్రంలో కొన్ని ఆర్టీసీ డిపోలను మూసేస్తున్నట్టు వస్తున్న వదంతులను సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఖండించారు. ఇలాంటి వదంతులను ఎవరూ నమ్మరాదని ఏ డిపోనూ మూసేయడం లేదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే జీ సాయన్న, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్ (జేబీఎస్)లో ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. కొవిడ్ సమయంలో రక్తం నిల్వలు అందుబాటులో లేక ఎంతో మంది మృత్యువాత పడ్డారని, ఈ నేపథ్యంలో రెడ్క్రాస్ సోసైటీ విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ ఉద్యోగులు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం ఆయన జేబిఎస్లోని పలు స్టాళ్లను, బస్సులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.