ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు టీఎస్ ఆర్టీసీ అనేక చర్యలు చేపట్టింది. ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. నిన్న బాలల దినోత్సవం సందర్భంగా 15 ఏండ్ల లోపు పిల్లలకు ఉచిత ప్రయాణం కల్పించారు. పెళ్లిళ్లలకు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంటే.. నూతన వధూవరులకు కానుకలు అందజేస్తున్నారు. అలా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతూ.. ఆర్టీసీ ప్రజలకు చేరువవుతోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాత బృందాలతో కార్యక్రమాలు నిర్వహించారు.
తాజాగా నాగర్కర్నూల్ డిపోకు చెందిన డ్రైవర్ శాంతయ్య.. ఓ పాట పాడి ప్రయాణికులను ఆకర్షించారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని నాయినిపల్లి మైసమ్మ ఆలయానికి ప్రతి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. దీంతో నాగర్కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి డిపోల నుంచి ఈ ఆలయానికి ప్రత్యేక బస్సులను నడిపిస్తారు.
అయితే నాగర్కర్నూల్ డిపోకు చెందిన డ్రైవర్ శాంతయ్య.. మైసమ్మ జాతరకు వచ్చే ప్రయాణికులను ఆకర్షించేందుకు అద్భుతమైన పాటను పాడారు. మైసమ్మ దేవత ప్రాశ్యస్తాన్ని తెలుపుతూ ఓ పాటను ఆలపించారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం చేద్దామంటూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు డ్రైవర్ శాంతయ్య. ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.