హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రైవేటుకు దీటుగా అత్యాధునిక హంగులతో టీఎస్ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్ బస్సులను తీసుకురానున్నది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువయ్యేందుకు హైటెక్ మాడల్లో ఈ బస్సులను రూపొందించింది. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా నామకరణం చేసింది. హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో నూతన నమూనా ఏసీ స్లీపర్ బస్సును ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం పరిశీలించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకొస్తున్న ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీవోవో డాక్టర్ వీ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.