TSRTC | హైదరాబాద్ : ప్రయాణికులను ఆకర్షించేందుకు టీఎస్ ఆర్టీసీ ఎప్పటికప్పుడు వినూత్న ఆఫర్లతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దసరా పండుగ వేళ మరో బంపరాఫర్తో టీఎస్ ఆర్టీసీ ముందుకొచ్చింది. రాఖీ పండుగకు లక్కీ డ్రా నిర్వహించి, ప్రయాణికులకు బహుమతులు అందజేసిన మాదిరిగానే.. దసరాకు కూడా ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. రాఖీ పండుగకు కేవలం మహిళలకు మాత్రమే అవకాశం కల్పించిన ఆర్టీసీ యాజమాన్యం, ఇప్పుడు పురుషులకు కూడా అవకాశం కల్పించింది.
దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు రూ. 11 లక్షల నగదు బహుమతులు అందజేయాలని నిర్ణయించింది. ఇందుకు చేయాల్సిందల్లా ఒక్కటే.. అదేంటంటే.. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుకాల మీ పూర్తి పేరు, ఫోన్ నంబర్ రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసి డ్రాప్ బాక్సుల్లో వేయడమే అని యాజమాన్యం తెలిపింది. ప్రతి రీజియన్ నుంచి ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలను ఎంపిక చేసి.. మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుంది.
ఈ నెల 21 నుంచి 23 తేదీ వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదీల మధ్య టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఆయా తేదీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ లక్కీ డ్రాకు అర్హులే అని ప్రకటించారు. పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
దసరా పండుగకు #TSRTC బస్సుల్లో మీరు ప్రయాణిస్తున్నారా!? కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సొంతూళ్లకు వెళ్తున్నారా!? అయితే మీరు రూ.11 లక్షల నగదు బహుమతులు గెలుపొందే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది ప్రభుత్వ రంగ సంస్థ టీఎస్ఆర్టీసీ. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. ప్రయాణం… pic.twitter.com/5oZjT8EJZx
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) October 10, 2023