హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు ఇతర రాష్ర్టాలకు కూడా విస్తరించాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా విశాఖకు కార్గో సేవలను టీఎస్ ఆర్టీసీ గురువారం ప్రారంభించింది. సీఎం కేసీఆర్ సలహా మేరకు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనలతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా కార్గో, పార్శిల్ సేవల్ని టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కార్గో, పార్శిల్ సేవలను విస్తరించిన ఆర్టీసీ.. తాజాగా ఈ సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి విస్తరించింది.
ఏపీలో వ్యాపార కేంద్రాలైన విజయవాడ, విశాఖ పట్టణాలకు నేరుగా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు మీదుగా కార్గో సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. ఈ కార్గో వాహనాలు పటాన్ చెరు, మెహిదీపట్నం, లక్డీకాపూల్, సీబీఎస్ నుంచి అందుబాటులో ఉండనున్నాయి. కోదాడ, సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, తుని మీదుగా ఈ వాహనాలు విశాఖకు చేరుకోనున్నాయి. ప్రయివేటు సర్వీసులతో పోలిస్తే.. టీఎస్ ఆర్టీసీ కార్గో ఛార్జీలు సమంజసంగా ఉండటంతో.. వినియోగదారులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు అని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
వ్యాపారులు, వినియోగదారులకు మధ్య ఒక పటిష్టమైన సరుకు రవాణా వ్యవస్థగా టీఎస్ ఆర్టీసీ కార్గో పని చేస్తోందని ప్రత్యేక అధికారి ఎస్ కృష్ణకాంత్ తెలిపారు. ఇల్లు మారడం, గృహ నిర్మాణం, పరిశ్రమలకు సంబంధించిన వస్తువులు, ఫర్నీచర్తో పాటు ఇతరత్రా వస్తువులను తరలించేందుకు కార్గో వాహనాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. దూరం, వస్తు పరిమాణం బట్టి నిర్దిష్టంగా ఒకే రకమైన ధరలు నిర్ణయించామని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం https://www.tsrtc.telangana.gov.in ( పార్శిల్ అండ్ కార్గో సర్వీస్ ) వెబ్సైట్ను చూడవచ్చని కృష్ణకాంత్ తెలిపారు.