TSICET-2023 | ఈ నెల 29న ఐ-సెట్ ఫలితాలను ప్రకటించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వరలక్ష్మి తెలిపారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనెజ్మెంట్ సెమినార్ హాలులో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారని చెప్పారు. టీఎస్ఐసీఈటీ చైర్మన్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వీ వెంకట రమణ, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఎస్కే మహమూద్, టీఎస్సీహెచ్ఈ సెక్రెటరీ శ్రీనివాసరావుతో కలిసి ఫలితాలను ప్రకటిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ (MBA), ఎంసీఏ(MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్షను మే 26, 27 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని 20 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరిగింది. తెలంగాణలోని 16 కేంద్రాలు, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 70,900 మంది విద్యార్థులు హాజరయ్యారు.