TS EAMCET | హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్ పేరు మారనున్నదా? ఈ ఏడాది కొత్త పేరుతో ఈ సెట్ను నిర్వహించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు. ఎంసెట్ పేరు మార్పు అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ఎంసెట్లో మెడికల్ లేకపోవడంతో ఎం (M) పదాన్ని తొలగించేందుకు అనుమతి కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపి జీవోను జారీ చేయాల్సి ఉన్నది. అధికారిక సమాచారం ప్రకారం టీఎస్ ఈఏపీ సెట్, టీఎస్ ఈపీఏ సెట్ అనే పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
2012-13లో జాతీయంగా మెడికల్ సీట్ల భర్తీకి ‘నీట్ యూజీ’ ప్రవేశ పరీక్షను కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత న్యాయ వివాదాల కారణంగా ఈ పరీక్ష ఆగింది. కేంద్రం చట్టం చేయడంతో 2016 నుంచి తెలంగాణసహా దేశవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సులు.. కాలేజీలు ఎంసెట్ నుంచి దూరమయ్యాయి. అయినా అప్పటి నుంచి ఎంసెట్ పేరునే కొనసాగిస్తున్నారు. మెడికల్ పేరును సూచించే ఎం (M) పదాన్ని తొలగించాల్సి ఉన్నది.
ఏపీలోనూ ఏపీ ఈఏపీ సెట్ అనే పేరు ఖరారు చేశారు. ఈ క్రమంలోనే ఉన్నత విద్యామండలి అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై ప్రభుత్వ వర్గాలు ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చలు జరిపారు. గతంలో జారీచేసిన ఎంసెట్ జీవోను సవరించి, కొత్త జీవోను జారీ చేయాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఎంసెట్ పేరు మార్పు జీవో వారంలో విడుదలయ్యే అవకాశాలున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. తాజా సమాచారం ప్రకారం మే 10 నుంచి ఎంసెట్ ప్రారంభం కానుండగా, 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ 12 నుంచి ఇంజినీరింగ్ విభాగానికి ఎంసెట్ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించారు. ఈ షెడ్యూల్ను సైతం ప్రభుత్వం విడుదల చేసే అవకాశమున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో 1984-85లో అన్ని వర్సిటీల్లో మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశాలకు ఎంసెట్ ప్రారంభమైంది. అంతకు ముందు ఏ యూనివర్సిటీకి ఆ వర్సిటీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించేది. ఇంజినీరింగ్, మెడికల్తోపాటు రానురాను ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి కోర్సులు చేరడంతో అన్ని కలిసేలా EAMCET (ఎంసెట్) అనే పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం ఎంపీసీ విభాగం విద్యార్థులకు ఇంజినీరింగ్, అండ్ టెక్నాలజీ కోర్సుల్లోని సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇక బైపీసీ విభాగం విద్యార్థులకు బీ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ వంటి కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తున్నారు. రెండేండ్లుగా బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో సీట్లను ఎంసెట్ (బైపీసీ) ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తున్నారు.