TS Weather Update | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇటీవల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురవడంతో ఎండల నుంచి ఊరట కలిగింది. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో వీణవంకలో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగత్ర నమోదైంది. జగిత్యాల జిల్లాలోని జైన, బుద్దేశ్పల్లి, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం మండలం గోధూరు, మల్లాపూర్ మండలం రాఘవపేట, వెల్గటూరులో 44.6 నుంచి 45.4 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో ముదిగొండ, నేలకొండపల్లి, చింతకాని, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, రంగంపల్లి, పాల్తెంతో పాటు హైదరాబాద్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
తెలంగాణ వైపుగా వైపు వాయవ్య దిశ నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని పేర్కొంది. 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. ఎండల తీవ్రత నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురయ్యే అవకాశాలున్నాయని, బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా వెంట వాటర్ బాటిల్స్ తీసుకెళ్లాలని.. తరుచుగా నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.