హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం దేశమంతా విద్యుత్తు సంక్షోభంతో అల్లాడిపోతుంటే తెలంగాణ మాత్రం విద్యుత్తు దీపాలతో వెలిగిపోతున్నదని ట్రాక్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని విద్యుత్ సౌధ ప్రాంగణంలో మంగళవారం తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్ల అసోసియేషన్ (టీఈఈఏ) ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల సంబురాలు’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎండీ ప్రభాకర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రం రాకముందు కొంత మంది పెద్దలు తెలంగాణలో విద్యుత్తు సంక్షోభం వస్తుందని చెప్పారని, కానీ సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం, మనందరి సహకారంతో నేడు రాష్ట్రమంతటా 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తు అందుతున్నదని తెలిపారు. పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని, 2,012 యూనిట్ల తలసరి విద్యుత్తు వినియోగంతో దేశంలోని ప్రధాన రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచిందని వివరించారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలోనూ సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఏర్పాటుకు అంగీకరించారని గుర్తుచేస్తూ.. అదే సహృదయంతో ఆయన మంచి పీఆర్సీ ఇస్తారని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన కరెంటును అందజేయడంలో విద్యుత్తు ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్నిర్మాణంలో సాంస్కృతిక విప్లవం కొనసాగుతుందని, దీనిలో భాగంగా తెలంగాణలో ఉన్న గంగా-జమున-తెహజీబ్ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని పేర్కొన్నారు.
కుల, మతాలకు అతీతంగా సాటివారిని ప్రేమించే ఈ నేలలో విద్వేషాలకు తావు ఇవ్వకూడదని, మనుషుల మధ్య కుల, మతాల పేరుతో చిచ్చు పెట్టే శక్తుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో 24 గంటలూ నాణ్యమైన కరెంటును సరఫరా చేసేందుకు నిరంతరం కష్టపడుతున్న విద్యుత్తు ఉద్యోగులు చరితార్థులని ప్రశంసించారు. పీఆర్సీ ఏర్పాటుతో ఉద్యోగుల్లో ధైర్యం నింపిన సీఎం కేసీఆర్కు టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేఎండీ శ్రీనివాసరావు, టీఈఈఏ ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్య శెట్టి, ముఖ్య సలహాదారు సురేందర్రెడ్డి, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను ‘కరెంటోళ్ల సంబురాలు’ కార్యక్రమంలో సత్కరించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. దీనిలో భాగంగా మంగళవారం ప్రముఖ చిత్రకారుడు గుండు శ్రీనివాస్, గాయకుడు శంకరం బాబ్జీని సన్మానించారు. వారికి ఆర్థిక సాయంగా రూ.50 వేల చెక్కును బహూకరించారు. తెలంగాణ వంటకాలతో ఏర్పాటు చేసిన భోజనాలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.