SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులతో మంత్రి పరీక్షల సన్నద్ధతపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడాది నుంచి ఆరుపేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో వందశాతం సిలబస్తో పరీక్షలు జరుపుతామన్నారు. వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నరల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ ఉండదని చెప్పారు.
నమూనా ప్రశ్న పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలన్నారు. సెలవుదినాల్లోనూ స్పెషల్ క్లాసులు నిర్వహించాలని, ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా పాఠాలు చెప్పాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీ పైనల్ పరీక్షలు నిర్వహించాలని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణతా శాతం సాధించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సబితా ఆదేశించారు.
పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.50 వరకు సైన్స్ పరీక్ష జరుగనున్నది. 3న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు), 4న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ), 6న ఇంగ్లీష్, 7న గణితం, 10న సైన్స్, 11న సోషల్ పరీక్ష జరుగనున్నది. అలాగే 12న ఓఎస్సీస్సీ పేపర్-1, 12న ఓఎస్సెస్సీ పేపర్-2 పరీక్ష జరుగనున్నది.