హైదరాబాద్ : ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా బస్సులు నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు తెలిపింది. పండుగకు 4,318 ప్రత్యేక బస్సులు నడుపనున్నది. రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాలు, సహా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు సైతం బస్సులు నడుస్తాయని సంస్థ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాలకు 3,334 బస్సులు, ఏపీని పలు ప్రాంతాలకు 984 బస్సులు నడుపనున్నట్లు పేర్కొంది.
పండుగ సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని టీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ వరప్రసాద్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, సీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్, ఆరాంఘర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్నగర్ పాయింట్లతో పాటు జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. www.tsrtconline.in వెబ్సైట్లో రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. ఏపీ వైపు విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ వివరించింది.