యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల పట్ల అగ్రవర్ణాలతో పోలిస్తే బడుగు, బలహీనవర్గాలు అత్యంత ఆసక్తి ప్రదర్శించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపకశాఖల్లో మొత్తం 17,516 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగా.. 7,33,559 అభ్యర్థులు మొత్తంగా 12,91,006 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో అత్యధికంగా 51% దరఖాస్తులు బీసీ వర్గాల నుంచి రావడం విశేషం. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి 41% దరఖాస్తులు రాగా, ఓసీ సామాజిక వర్గం నుంచి 7.65% దరఖాస్తులు వచ్చాయి.
హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల పట్ల అగ్రవర్ణాలతో పోలిస్తే బడుగు, బలహీనవర్గాలు అత్యంత ఆసక్తి ప్రదర్శించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపకశాఖల్లో మొత్తం 17,516 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగా.. 7,33,559 అభ్యర్థులు మొత్తంగా 12,91,006 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో అత్యధికంగా 51% దరఖాస్తులు బీసీ వర్గాల నుంచి రావడం విశేషం.
ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి 41% దరఖాస్తులు రాగా, ఓసీ సామాజిక వర్గం నుంచి 7.65% దరఖాస్తులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ర్టాలకు చెందిన అభ్యర్థుల నుంచి 3.48% దరఖాస్తులు వచ్చాయి. మహిళా అభ్యర్థుల నుంచి 2,76,311 దరఖాస్తులు (21%) రావడం మరో విశేషం. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసే తుది గడువు ముగిసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల కోసం అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో ఆ ఐదు జిల్లాల నుంచే 33% ఉండటం గమనార్హం. అతి తక్కువగా ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి వచ్చాయి. ఈ జిల్లాలన్నీ కలిపి మొత్తం దరఖాస్తుల్లో కేవలం 7% మాత్రమే ఉన్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.
ప్రిలిమ్స్, మెయిన్స్ పోటీ పరీక్షలను తెలుగు మీడియంలో రాసేందుకు 67% మంది ఆప్షన్ ఇచ్చారు. 32.8% మంది ఇంగ్లీష్ మీడియం ప్రశ్నపత్రం ఎంచుకోగా, 0.2% మంది ఉర్దూ మీడియంకు ఆప్షన్ ఇచ్చారు.
ఎస్సై, తత్సమాన ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షను ఆగస్టు 7న (ఆదివారం) నిర్వహించేందుకు టీఎస్ఎల్పీఆర్బీ ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆగస్టు 21న(ఆదివారం)ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, కచ్చితమైన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.