హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): పోలీస్శాఖలో కొలువుల జాతరకు తెరలేవబోతున్నది. జోనల్ వ్యవస్థపై స్పష్టత రావడంతో నియామక ప్ర క్రియ వేగవంతమైంది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చేలా తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) కసరత్తు ముమ్మరం చేసినట్టు సమాచారం. వాస్తవానికి డిసెంబర్లోనే పోలీస్శాఖ ఖాళీల భర్తీపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం సైతం ఆమోదించింది. అప్పటికి ఇంకా కొత్త జోన్లకు సంబంధించి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయకపోవడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. తాజాగా జోనల్ వ్యవస్థ ఖరా రు కావడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకోనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సైస్థాయిలో దాదాపు 350 వరకు, కానిస్టేబుల్ 10 వేలకు పైగా పోస్టుల భర్తీకి కసరత్తు కొనసాగుతున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వారీగానే ఉన్న సిబ్బందిని తాత్కాలిక సర్దుబాటు కింద విభజించారు. నిర్ధిష్టంగా ఏ జిల్లాకు ఎంత మంది అన్నది పూర్తికాలేదు. కొత్త జిల్లాల ప్రకారం ముందుగా సిబ్బంది విభజన పూర్తయితే, ఆ తర్వాత శాంక్షన్డ్ స్ట్రెంత్ ఎంత, వాస్తనవానికి ఖాళీలు ఎన్ని ఉన్నాయన్నది మరింత స్పష్టంగా తెలుస్తుంది. ఆ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నదని, అది పూర్తయితే అతి త్వరలో నియామకాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అకవాశాలున్నాయని అధికారవర్గాలు తెలిపాయి.