TS PG ECET | టీఎస్ పీజీఈసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిలో పీజీఈసెట్పై బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్లు వీ వెంకట రమణ, ఎస్కే మహమూద్, సెక్రెటరీ ఎన్ శ్రీనివాస్ రావు, టీఎస్ పీజీఈసెట్ కన్వీనర్, ప్రొఫెసర్ పీ రమేశ్బాబు హాజరయ్యారు.
సమావేశం అనంతరం లింబాద్రి కౌన్సెలింగ్ షెడ్యూల్ను వివరించారు. జులై 28న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. జులై 31 నుంచి ఆగస్టు 18 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఆగస్టు 7 నుంచి 9 తేదీ వరకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ఆగస్టు 21 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్లు, 24న వెబ్ ఆప్షన్లలో ఎడిట్కు అవకాశం కల్పిస్తామని, ఆగస్టు 26వ తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.
ఆగస్టు 28 నుంచి 30 వరకు కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలని లింబాద్రి వివరించారు. సెప్టెంబర్ 4 నుంచి రెండోదశ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 11 నుంచి 12 వరకు ఫేజ్ వెబ్ ఆప్షన్లు, సెప్టెంబర్ 13న వెబ్ ఆప్షన్లలో ఎడిట్ చేసుకోవచ్చని చెప్పారు. సెప్టెంబర్ 16న రెండోదశలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని, సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని, సెప్టెంబర్ 19 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని లింబాద్రి వివరించారు.