హైదరాబాద్, జూన్6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేండ్ల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ ్ట(సీపీజీఈటీ-2022)ను జూలై 20 నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సోమవారం విడుదల చేశారు. హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీల్లోని 50 కోర్సుల్లో మొత్తం 44 వేల సీట్లను దీని ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మహిళా యూనివర్సిటీ ప్రవేశాలను సైతం కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫొరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయోలజీ అభ్యర్థులు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం బీసీఈఎస్ఎఫ్ఎస్జీ అండ్ ఎం అనే ఆప్షన్ను ఎంచుకోవాలని సూచించారు. అన్ని సబ్జెక్టులకు ప్రవేశపరీక్షను మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్లో నిర్వహించనున్నారు. మొత్తం వంద ప్రశ్నలు ఉంటాయి. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాస్రావు, ఓయూ వైస్ చాన్స్లర్ సీతారామారావు, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, సీపీజీఈటీ కన్వీనర్ పాండు రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఫీజుల వివరాలు
ఒక్క సబ్జెక్ట్కు ఓసీ/బీసీ విద్యార్థులు రూ.800, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.600 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ.450 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సీపీజీఈటీ-2022 సిలబస్, నమూనా దరఖాస్తు లు తదితర వివరాలకు www.osmania.ac.in, https://cpget.ac.in, www.ouadmissions.com ను సందర్శించాలి.