హైదరాబాద్ : టీఎస్ పీఈసెట్ -2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి విడుదల చేశారు. టీఎస్ పీఈసెట్లో 95.93 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రకటించారు. బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సుల్లో పురుష అభ్యర్థులు 98.33 శాతం, అమ్మాయిలు 91.40 శాతం ఉత్తీర్ణత సాధించారు. అండర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(యూజీడీపీఈడీ) కోర్సుల్లో అబ్బాయిలు 97.04 శాతం, అమ్మాయిలు 95.14 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.
అండర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(యూజీడీపీఈడీ), బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలు జరిగిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా 6 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 3,659 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 2,360 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 2,264 మంది ఉత్తీర్ణత సాధించారు.