Medaram Jathara | మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఏర్పాట్లపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ సీఎస్ శాంతికుమారి, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సారి జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మంజూరు చేసిందని తెలిపారు. అన్ని అభివృద్ధి పనులు జనవరి 31లోగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం చేసుకొని వెళ్లేలా ఏర్పాటు చేయాలని, ఉచిత బస్ సౌకర్యంతో బస్ ప్రయాణంలో జాతరకు వచ్చే మహిళా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.