KTR | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : పదవుల కోసం కొట్లాడుకునేవాళ్లు కాక, ప్రజల బాగోగులను పట్టించుకునేవాళ్లే రాష్ట్ర ప్రజలకు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నలుగురు లీడర్లు ఉంటే ఐదురుగు సీఎంలు ఉండే పార్టీలు కాదు రాష్ట్రానికి కావాల్సిందని తేల్చిచెప్పారు. అటువంటి పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని అన్నారు. ఇటువంటి పార్టీల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం శాసనమండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఆయన తనదైన శైలిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
`తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ 24 అంతస్తులతో వరంగల్లో నిర్మితం అవుతున్నది. ఆ దవాఖానలో సేవలు ప్రారంభమైతే ఉత్తర తెలంగాణ మొత్తానికి అద్భుత వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. మాతా శివుమరణాలు తగ్గి, ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ఇంటి దగ్గరి నుంచి ఆడబిడ్డలను ప్రసవానికి దవాఖానకు తీసుకెళ్లి ప్రసవం అయిన తరువాత తిరిగి ఇంటికాడ దిగబెట్టే సేవలు దేశంలో ఎక్కడాలేని విధంగా సంస్కారం ఉన్న ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం విరాజిల్లుతున్నది. అలాగే కంటివెలుగు వంటి కార్యక్రమం తేవాలని కాంగ్రెస్కు ఆలోచించలేదు. ఆ సోయి ఆ పార్టీకి లేదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటిపరీక్షలు నిర్వహించి అద్దాలు ఇప్పించి, అవసరమైన వారికి ప్రభుత్వమే శస్త్రచికిత్సలు చేయాలనే స్పృహ కాంగ్రెస్కు ఉన్నదా? ` అని కేటీఆర్ నిలదీశారు.
`కాంగ్రెస్ హయాంలో జూనియర్ కాలేజీలు 443, అదే ఈరోజు కొత్తగా 1372 జూనియర్ కాలేజీల ఏర్పాటుతో గురుకుల పాఠశాలన్నింటిని అప్గ్రేడ్ చేసుకున్నాం. దీంతో రాష్ట్రంలో జూనియర్ కాలేజీల సంఖ్య 1775కు చేరింది. కాలేజీల్లో 3.66 లక్షల మంది పిల్లలు చదువుతున్నరు. రెసిడెన్షియల్ స్కూల్లో చదివే ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం రూ. 1.25లక్షలు ఖర్చుచేస్తున్నది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టాం. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద రూ. 730ం కోట్లను ఖర్చుచేసి బ్రహ్మాండంగా 26వేల పాఠశాలను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నాం. గురుకులాల్లో చదువుకున్న పిల్లలు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎంల్లో సీట్లు కొడ్తుతుంటే గర్వంగా ఉన్నది. రాష్ట్రం నుంచి మైనారిటీ విద్యార్థులే 2900 మంది ఒక్కొక్కరికీ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ తీసుకొని అద్భుతంగా విదేశాల్లో చదువుతున్నారు. విద్యాభివృద్ధి పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇంతకన్నా వేరే ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉన్నదా? ` అని ప్రశ్నించారు.
`ఉద్యోగుల సంక్షేమం విషయంలో 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఐఆర్ ప్రకటించబోతున్నది. కడుపునిండా పీఆర్సీ ఇస్తామని సీఎం చెప్పారు. మా ఉద్యోగులతో మాకున్న పేగుబంధాన్ని మరింత ధృడపరచుకుంటాం. ఇందులో ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. ఆర్టీసీలో 43 వేలమందిని ప్రభుత్వంలో కలుపుకొని గౌరవించుకుంటాం. కాంగ్రెస్, టీడీపీ తెచ్చిన కాంట్రాక్ట్ విధానాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తున్నది. అలాగే కాంగ్రెస్ హయాంలో వీఆర్ఏలకు కేవలం రూ. 6 వేలు ఇస్తే మేము పేస్కేల్ ఇచ్చి అక్కున చేర్చుకున్నాం` అని కేటీఆర్ చెప్పారు.
`కాంగ్రెస్ హయాంలో తెలంగాణ బిడ్డల ఉపాధికి గండికొట్టి పొట్టగొట్టి నాన్లోకల్స్కు అవకాశాలు కలిస్తే 95 శాతం ఉద్యోగాలను స్థానికులకు దక్కేలా చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్ది, సీఎం కేసీఆర్ది. అలాగే కాంగ్రెస్ పార్టీ సింగరేణిని నడిపించలేక కేంద్రం శరణుజొచ్చింది. ఫలితంగా సింగరేణిలో 49వాటా కేంద్రానికి వెళ్లింది. కానీ, ఇవ్వాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సమర్దనాయకత్వంలో సింగరేణి పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నది. కాంగ్రెస్ ఊడగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పునరుద్ధరించింది` అని కేటీఆర్ అన్నారు.
`అవినీతి రహితంగా, పారదర్శకంగా ముందుకు సాగుతున్నాం. హైదరాబాద్లో తొలి ఐటీ టవర్ 1987లో బేగంపేటలో వచ్చింది. 1987 నుంచి 2014 వరకు సరిగ్గా 27 ఏండ్లలో ఐటీ ఉత్పత్తులు కేవలం రూ. 57వేల కోట్లు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత ఒక్క సంవత్సరమే (2021-22 నుంచి 2022-23 వరకు) పెరిగిన ఐటీ ఎగుమతులు రూ. 57 వేల కోట్లు. అంటే 27 ఏండ్లల్లో రూ. 57వేల కోట్లు తెస్తే ఒకే ఒక్క ఏడాదిలోనే ఐటీ రంగం పురోభివృద్ధిని సాధించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాడు 3 లక్షల ఉద్యోగులు ఐటీ రంగంలో ఉంటే, ఈరోజు 9 లక్షల 15వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తొమ్మిదేండ్లల్లో కొత్తగా 6.15 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. కరోనా లేకుంటే ఈ పాటికి 10 లక్షల ఉద్యోగాలు దాటేవి. గత రెండేండ్లలో బెంగుళూర్ను దాటేసినం. గత సంవత్సరం దేశం మొత్తంలో సృష్టించబడ్డ ఐటీ ఉద్యోగాల్లో 33 శాతం తెలంగాణ నుంచే వచ్చాయి. దేశవ్యాప్తంగా 4 లక్షల 50వేల ఉద్యోగాల్లో తెలంగాణలో 1 లక్షా 50వేల ఉద్యోగాలు సాధించాం. అదే ఈ సంవత్సరం 44 శాతం ఉద్యోగాలు పెరిగాయి. ఇంత ఘనత సాధించినందుకు తెలంగాణ బిడ్డలుగా గర్వపడాలి. ఏబుల్ లీడర్షిప్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం వల్లే సాధ్యమైంది. పదవుల కోసం కొట్లాడుకునేవాళ్లు కాకుండా ప్రజల బాగోగులను పరిరక్షించేవాళ్లు కావాలి.
`ఎన్నికల్లో పార్టీ విధానం చెప్పుకోండి.. మేం 44 శాతం వృద్ధిని సాధిస్తే మీరు 88 శాతం సాధిస్తామని చెప్పండి, అలాగే మేం 24 గంటల కరెంట్ ఇస్తామంటే మీరు 25 గంటల కరెంట్ ఇస్తామని చెప్పండి. అంతేకానీ పిండం పెడ్తం.. గండం అయితం అనేవి వద్దు` అని కేటీఆర్ సూచించారు.
`కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ప్రముఖ ఎరువుల తయారీ సంస్థ క్రిబ్కోను పోగొట్టుకోవడం మంచిది కాదు. మా ప్రాంతానికి, మా జిల్లాకు పెద్దమనిషి మీరు (ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని ఉద్దేశించి). అందరం కలిసి వెళదాం. మీరే దగ్గరుండి ఆ స్థలం ఏదో మీరే వెతకండి. అధికారం ఎవరిదైనా కావొచ్చు. కానీ మన ప్రాంతానికి క్రిభ్కో పరిశ్రమ వస్తున్నప్పుడు దాన్ని పోగొట్టుకోవడం మంచిది కాదు. కాబట్టి దయచేసి అక్కడి ప్రజలను ఒప్పించి స్థలం ఎంపిక చేయండి. రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళదాం` అని కేటీఆర్ చెప్పారు.
చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కానీ 99 శాతం బాగుంటే కేవలం ఒకశాతం మాత్రమే అక్కడక్కడ సమస్యలున్నాయి. కోట్ల ఎకరాలతో కూడిన వ్యవహారంలో చిన్న చిన్న సమస్యలు వస్తయి. అంతేగానీ ఎలుకలు ఉన్నాయని ఇంటిని తగలబెట్టుకోం కదా. మీ పార్టీ ఏమో ధరణిని రద్దు చేస్తామని చెబుతున్నది. ఇంత కష్టపడి నిర్మించిన మంచి వ్యవస్థను, రైతులకు అవినీతి రహితంగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అవుతున్ను వ్యవస్థను, దళారుల నుంచి దూరం చేసి రైతుల చేతిలో పెట్టిన వ్యవస్థను రద్దు చేస్తామంటే ఎలా? ధరణిపై మీ పార్టీ అభిప్రాయాన్ని మార్చుకోండి. రైతులకు మేలు జరిగే వ్యవస్థపై రాజకీయం వద్దు` అని కేటీఆర్ కోరారు.
`రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. అది మా ప్రభుత్వంలోనూ కనీసం పేరు కూడా మార్చకుండా కొనసాగిస్తున్నాం. పైగా ఆ పథకాన్ని సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారు. ఈ విధంగా అధికారంలో ఎవరూ ఉన్నా, ఒక మంచి విధానాన్ని ఇంకా బలోపేతం చేయాలే గానీ బంద్ చేస్తం అంటే మంచిది కాదు. మ్యుటేషన్కు డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే అంశంపై విచారణ చేయిస్తాం. ట్రిబ్యునల్ ఏర్పాటుపైనా ఆలోచిస్తున్నాం. ధరణి సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్ కూడా సుముఖంగానే ఉన్నారు` అని కేటీఆర్ తెలిపారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడంపై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. `నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు మే నిబద్దతతో ఉన్నాం. మీరే చైర్మన్గా ఉండండి. మీరే బాధ్యత తీసుకొని రైతులను సంఘటితం చేయండి, అన్ని పార్టీలను ముందుకు తీసుకురండి. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మాది. రైతుల కోసం రూ. 4.5 లక్షల కోట్లు ఖర్చు చేసిన మాకు ఫ్యాక్టరీ తెరిపించేందుకు రూ. 400 కోట్లు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. రాజకీయం కోసమో, ఓట్ల కోసమో చెప్పడం లేదు. నిజాయితీతో చెబుతున్నాను. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు మేము 100 శాతం నిబద్దతతో ఉన్నాం. వరి నుంచి రైతులను మళ్లించాలి. రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి రైతులతో మాట్లాడి ఒక ఫార్ములా తీసుకొస్తానంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అవసరమైన ఖర్చు పెడతం` అని కేటీఆర్ వివరించారు.