హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : టీఎస్ లాసెట్, పీజీలాసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాల వివరాలను వెల్లడించారు. ఫలితాల్లో మొత్తం 80.21% విద్యార్థులు అర్హత సాధించారని లింబాద్రి తెలిపారు. మూడేండ్ల లాలో 78.59%, ఐదేండ్ల లాలో 80.21%, పీజీ లాసెట్లో 94.36% విద్యార్థులు అర్హులైనట్టు వెల్లడించారు. మూడేండ్ల లా కోర్సులో ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థి శ్రీరామ్ బొడ్డు మొదటి ర్యాంకును సాధించాడు. ఐదేండ్ల లా కోర్సు టాపర్గా యూపీలోని బలరాంపూర్ జిల్లా విద్యార్థి మహ్మద్ మహబూబ్ కమాలుద్దీన్ నిలిచాడు. పీజీ లా సెట్లో ఏపీ ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి టీ రవీంద్రబాబు మొదటి ర్యాంకు పొందాడు. అత్యధికంగా 81.80శాతంతో అబ్బాయిలు సత్తాచాటగా, అమ్మాయిలు 76.37శాతం ఉత్తీర్ణత సాధించారని లింబాద్రి పేర్కొన్నారు.
సాధారణంగా ఆర్ట్స్ కోర్సుల్లోని విద్యార్థులు లా కోర్సుల్లో చేరడం సహజం. కానిప్పుడు బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి కోర్సుల్లోని విద్యార్థులు మూడేండ్ల లా కోర్సులో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది 4,043 మంది బీటెక్ విద్యార్థులు లాసెట్లో క్వాలిఫై అయ్యారు. ఇక బీ- ఫార్మసీ నుంచి 298, బీబీఏ 225, బీసీఏ 108, ఎంబీబీఎస్ 50, ఫిజియోథెరపీ 30, బీడీఎస్ 27, బీహెచ్ఎంఎస్ కోర్సు పూర్తిచేసిన వారు 13 మంది లాసెట్లో అర్హత సాధించారు. ఈ ఏడాది లాసెట్లో అత్యధికంగా బీకాం విద్యార్థులు 5,862, బీఎస్సీ విద్యార్థులు 5,110, బీఏ విద్యార్థులు 4,324 లాసెట్లో క్వాలిఫై అయ్యారు. కాగా, 16 ఏండ్ల నుంచి 60 ఏండ్లు పైబడిన వారు కూడా లాసెట్లో అర్హత సాధించడం విశేషం.