హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 3.48 లక్షల విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లింపు గడువు ఇటీవలే ముగిసింది. ఫస్టియర్ ఇంప్రూవ్మెంట్ కోసం 99 వేలకుపైగా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫస్టియర్ విద్యార్థులే ఈ ఏడాది అత్యధికంగా 2 లక్షల మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయబోతున్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. అయితే, తమకు వచ్చిన మార్కుల పట్ల సంతృప్తి చెందని 15 మంది సెకండియర్ విద్యార్థులు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ మొత్తం సబ్జెక్టులకు పరీక్షలు రాసేందుకు సిద్ధపడ్డారు. ఇంటర్ ఫస్టియర్లో ఇంప్రూవ్మెంట్, సెకండియర్లో బెటర్మెంట్ స్కీమ్లు ఉన్నాయి.
ఈ విధానంలో ఫస్టియర్ విద్యార్థి ఏదో ఒక సబ్జెక్టుకు ఫీజు చెల్లించి, పరీక్ష రాసి, మార్కులు పెంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఇంగ్లిష్లో 100 మార్కులకు 55 మార్కులు వస్తే.. ఇంప్రూవ్మెంట్ రాసి 85 మార్కులు తెచ్చుకుంటే వీటిని లెక్కలోకి తీసుకుంటారు. అదే 25 మార్కులొచ్చి ఫెయిల్ అయితే గతంలో సాధించిన 55 మార్కులతో పాస్ అయినట్లుగానే ప్రకటిస్తారు. ఇలా ఎన్ని సబ్జెక్టులైనా రాసుకోవచ్చు.
సెకండియర్లో ఒక విద్యార్థికి 500 మార్కులకుగాను గత మేలో నిర్వహించిన పరీక్షల్లో 420 మార్కులే వచ్చాయి. ఈ విద్యార్థి బెటర్మెంట్ కోసం దరఖాస్తు చేసుకొంటే ఆ విద్యార్థి సెకండియర్లోని మొత్తం ఐదు సబ్జెక్టులకు పరీక్షలు రాయాలి. థియరీ, ప్రాక్టికల్స్ రెండింటికీ హాజరు కావాల్సిందే. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ విద్యార్థికి 500 మార్కులకు 480 మార్కులు వస్తే, 420 మార్కులు వచ్చిన మెమోను సరెండర్ చేసి 480 మార్కులొచ్చిన మెమోను పొందవచ్చు. ఇదే విద్యార్థి ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినా.. ఒక పరీక్షకు గైర్హాజరైనా, పరీక్ష రాయలేకపోయినా ఫెయిల్ అయినట్లే లెక్క. పాత మార్కులు లెక్కలోకి రావు. ఇలా ఫస్టియర్, సెకండియర్ రెండింటిని ఒకేసారి, లేదంటే సెకండియర్లోని మొత్తం పేపర్లకు పరీక్షను రాసుకోవచ్చు.