హైదరాబాద్ : తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సోమవారం విడుదలైంది. అక్టోబర్ 10 నుంచి 13 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అక్టోబర్ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించగా.. 18న ఎంబీఏ, ఎంసీఏ అభ్యర్థులకు మొదటి విడుదల సీట్లు కేటాయించనున్నారు. 23 నుంచి ఐసెట్ తుదివిడుత కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగనున్నది.
23 నుంచి 25 వరకు తుదివిడుత వెబ్ ఆప్షన్లు, 28న ఎంబీఏ, ఎంసీఏ తుదివిడుత సీట్ల కేటాయించనుండగా.. అదేరోజు స్పాట్ అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి జూలై తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఏపీలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 68,781 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆగస్టు చివరి వారంలో ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.