హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ గంగపుత్రులు, ముదిరాజ్లు కలిసికట్టుగా పని చేసుకోవాలని, సమస్యలు పరిష్కరించుకోవాలని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. మత్య్సకారులను ఆర్థికంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగానే ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలుచేస్తున్నట్టు పేర్కొన్నారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి గంగపుత్ర, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై చర్చించారు. సంఘాల్లోని పలువురు సూచించిన ప్రతిపాదనలపై చర్చించేందుకు ఆగస్టు 7న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చెప్పారు. ప్రమాదవశాత్తు మరణించిన 105 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ నిధులను విడుదలచేసినట్టు మంత్రి తెలిపారు. శనివారం ఆయా కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. అంతకు ముందు 4 మొబైల్ ఫిష్ ఔట్లెట్లను లబ్ధిదారులకు అందజేశారు.