Mallampalli | రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పాటుకానున్నది. ములుగు జిల్లాలో మల్లంపల్లి మండలం ఏర్పాటుకు ప్రతిపాదించింది. మూడు గ్రామాలతో మల్లంపల్లి మండలం ప్రాథమిక ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు, వినతులకు పక్షం రోజులు గడువు ఇచ్చింది. ములుగు జిల్లా 2019 ఫ్రిబవరి 16న ఏర్పాటైంది. జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న ములుగు రెవెన్యూ డివిజన్ను విడదీసి తొమ్మిది మండలాలతో ప్రభుత్వం జిల్లాను ఏర్పాటు చేసింది. తాజాగా మల్లంపల్లిని సైతం మండలంగా ఏర్పాటు చేయనుండడంతో మండలాల సంఖ్య పదికి చేరనున్నది.
మల్లంపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేరసింది. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న మల్లంపల్లి ప్రజల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో 331ని జారీ చేసిందన్నారు. మల్లంపల్లి ప్రజల కోరికను మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపాదనలు సైతం అందించి.. మండలంగా ఏర్పాటు చేయాలని ఒప్పించారు. మల్లంపల్లిని మండలం చేస్తామని చెప్పి హామీ నిలబెట్టుకున్న మంత్రికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.