కేంద్ర ప్రభుత్వానికి హఠాత్తుగా తెలంగాణ యాదికొచ్చింది. తెలంగాణ అనే రాష్ట్రం ఒకటి ఉన్నదని, ఏటా ఆవిర్భావ దినం అంటూ నిర్వహిస్తారనే సోయి మోదీ సర్కారుకు రాత్రికిరాత్రే పుట్టుకొచ్చింది. ఎనిమిదేండ్లుగా ఆ సంగతే తెలియనట్టు మసులుకున్న బీజేపీ సర్కారు.. ఈ జూన్ 2న ఢిల్లీలో తెలంగాణ పండుగ.. అదీ అధికారికంగా జరుపుతారట! డాక్టర్ అంబేదర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించే ఈ ఉత్సవాలకు సాక్షాత్తూ హోంమంత్రి అమిత్ షా, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి కిషన్రెడ్డి హాజరవుతారట!
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తల్లిని చంపి బిడ్డను బతికించారని విచిత్ర, వికృత వ్యాఖ్యలు చేసే ఈ బ్యాచ్కు తెలంగాణ ఆవిర్భావంపై ఉన్నపళంగా ఈ ప్రేమ ఏమిటి? ఇదేం చోద్యం? అని ఆశ్చర్యపోతున్నారా? తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రం ఏనాడూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించిన పాపాన పోలేదు. అంతేకాదు, మరే ఇతర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించిన ఆచారమూ కేంద్రానికి లేదు. రెండు రోజుల క్రితం.. మే 30న గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరిగింది. గోవాలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నా.. కేంద్రం ఎలాంటి కార్యక్రమాల్ని ఢిల్లీలో నిర్వహించలేదు. మరిప్పుడు తెలంగాణపై నడమంత్రపు ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నారు? తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతూ, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వకుండా, విద్యా, వైద్య సంస్థలు మంజూరు చేయకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు కేంద్రం పాల్పడుతున్నది.
తెలంగాణ వాటన్నిటినీ జాతీయ స్థాయిలో ఎండగడుతున్నది. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్టుగా.. తెలంగాణపై తాము వివక్ష చూపడం లేదని చెప్పుకొనే తాపత్రయమే ఇదంతా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ రణనిన్నాదం పుట్టించిన దడుపే బీజేపీ కారణమన్న చర్చ కూడా జరుగుతున్నది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉనికి చాటుకోవాలంటే తెలంగాణ నినాదం ఎత్తుకోక తప్పదనే ధోరణి కూడా ఇందులో ఉన్నదని పలువురు అంటున్నారు. మొక్కుబడిగా కాకినాడలో తెలంగాణ తీర్మానం చేసినా తర్వాత కాలంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపుల్లలు వేసిన చరిత్ర బీజేపీది. ఇది ప్రజలకు తెలుసు. బీజేపీ నేతలు ఎప్పుడూ సెప్టెంబర్ 17 విమోచన దినం గురించే హంగామా చేశారు తప్పితే రాష్ట్ర అవతరణ గురించిన ఉత్సాహం వారిలో ఏనాడూ, ఏ కోశానా కనిపించలేదు.
తెలంగాణపై కన్నుపడ్డ బీజేపీ… ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ, మరో వైపు గతంలో ఎన్నడూ లేనివిధంగా అవిర్భావ దినోత్సవం పేరిట రంగులు పూసుకోవడాన్ని ఎలా చూడాలి? వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఎలాంటి అప్రజాస్వామ్యిక చర్యలకైనా పాల్పడి, అడ్డదారులైన తొక్కి, ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. దీనిలో భాగంగానే తెలంగాణపై బూటకపు ప్రేమను ఒలకబోస్తున్నదని, అధికారం కోసం కపట ప్రేమను చూపుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన బీజేపీ.. అదే తరహాలో మరోసారి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.