హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ)పరీక్షలను మే 10 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో ఎంసెట్ పరీక్షాతేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు. రెండు రోజులపాటు నాలుగు సెషన్లు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగానికి, మూడు రోజులు ఆరు సెషన్లలో ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తారు. ఎంసెట్కు ముందు లేదా వెనుక బీటెక్లో ల్యాట్రల్ ఎంట్రీకోసం ఈసెట్ నిర్వహిస్తారు. ఒకేరోజున రెండు లేదా మూడు సెషన్లలో ఈసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంసెట్తో పాటు ఈసెట్, ఎడ్సెట్, ఐసెట్, లాసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఈ వారంలో విడుదల చేసే అవకాశాలున్నాయి. అన్ని పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించనుండటంతో ఆయా తేదీల్లో మరో పరీక్ష జరగకుండా చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ ప్రతినిధులతో చర్చించి, పలు జాగ్రత్తలు తీసుకొని ఆయా పరీక్షల తేదీలను ఖరారు చేసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
గత సంప్రదాయాలకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఏటా ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తిచూపే వర్సిటీలకు ఉన్నత విద్యామండలి లేఖలు రాస్తుంది. ఈ లేఖలకు వర్సిటీలు స్పందించి, కన్వీనర్లను నియమిస్తాయి. తర్వాత కొంత కాలానికి ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను విడుదల చేస్తాయి. కానీ ఈ ఏడాది ఉన్నత విద్యామండలికి పూర్తిస్థాయి చైర్మన్ లేకపోవడవంతో ప్రస్తుతం ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ముందుగానే ప్రకటిస్తున్నారు. జేఈఈ మెయిన్ రెండోవిడతను ఏప్రిల్ 1 నుంచి 15, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మే 26న, నీట్ (యూజీ) పరీక్షను మే 5న నిర్వహిస్తారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పరిస్థితులెలా ఉంటాయోన్న ఆందోళన అధికారులను వెన్నాడుతున్నది. విద్యార్థుల్లో సహజంగా ఉండే టెన్షన్ను దూరం చేసేందుకు ముందుగా పరీక్షాతేదీలను ప్రకటిస్తారు. ఆ తర్వాత సెట్స్ను నిర్వహించే వర్సిటీలు… కన్వీనర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నది.