హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు విజయవంతంగా మెరుగైన సేవలందిస్తున్న టీఎస్బీపాస్ను త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది. మొదట ఏదైనా ఒక గ్రామీణ మండలంలో ప్రయోగాత్మకంగా, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో టీఎస్బీపాస్ ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి, అవినీతి, నిర్లక్ష్యం, జాప్యం వంటివి లేకుండా ఉండటానికి ఈ విధానం మంచి ఫలితం ఇస్తుందని అంచనా వేస్తున్నారు. పట్టణాలు, నగర ప్రాంతాల్లో అవినీతి, జాప్యానికి తావు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్)ను 2020 నవంబర్ 16న తీసుకొచ్చారు. ఈ విధానం పట్టణాల్లో విజయవంతం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు.
ఈ నేపథ్యంలో ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కాకుండా, హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లోని ఒక మండలంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అక్కడ ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలు తెలుసుకొని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అమలుచేస్తారు. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి అనుమతులకు ఎంత ఫీజు వసూలు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉన్నది. కొత్త జిల్లాలు, డివిజన్లు,మండలాలు ఏర్పడటంతోపాటు పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోవడంతో స్థానికంగా ఉండేవారేకాకుండా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు సైతం కొత్త ఇండ్లు నిర్మించుకోవడానికి ముందుకొస్తున్నారు. కొంత కాలంగా గ్రామీణ ప్రాంతాల్లో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి.
ఇల్లు కట్టుకోవాలంటే అనుమతుల్లో జాప్యం, లంచాలు, కొందరికి డబ్బులు తీసుకొని అనుమతులు లేకుండానే ఇంటిని కట్టుకుంటుంటే చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్ల కోసం తగిన స్థలం వదలకుండానే అనుమతులు ఇవ్వడం లాంటివి చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. క్రమపద్ధతిలో ఇండ్లు ఉండేలా చూడటానికి, టీఎస్బీపాస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. దీని కోసం ఇప్పటికే అధికారుల స్థాయిలో కసరత్తు పూర్తయింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలు చేయనున్నారు. పట్టణాల్లో 75 గజాలలోపు స్థలాలకు కేవలం (ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్) దరఖాస్తు చేసుకొంటే సరిపోతుంది. 75 నుంచి 600 గజాల వరకు ఇన్స్టంట్ అప్రూవల్ ఇస్తున్నారు. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేసే అవకాశం ఉన్నది.