హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కాలేజీలు అనుబంధ గుర్తింపు పొందాలంటే నిరభ్యంతర పత్రాలు తప్పనిసరి అని ఇంటర్బోర్డు అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఎన్వోసీలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అఫిలియేషన్ ఇవ్వమని చెప్తున్నారు. ఇంటర్ ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపునిచ్చేందుకు బోర్డు ఇటీవలే నోటిఫికేషన్ను విడుదల చేయగా.. ఈ నెల 12 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకానున్నది. గుర్తింపు కోసం దరఖాస్తు చేసే కాలేజీలు.. శానిటరీ సర్టిఫికెట్, ఫైర్సేఫ్టీ ఎన్వోసీ, స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఫైర్సేఫ్టీ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలేజీల యాజమన్యాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 600కు పైగా కాలేజీలు హాస్టళ్లను నిర్వహిస్తుండగా.. ఆయా కాలేజీలు ఇంటర్బోర్డు నుంచి గుర్తింపు పొంది ఉండాలని మూడేండ్ల కిందట మార్గదర్శకాలిచ్చారు. ఈ అంశం ప్రస్తుతానికి హైకోర్టు పరిధిలో ఉన్నది. హాస్టళ్లకు అనుమతుల ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడంలేదని బోర్డు అధికారులు వెల్లడించారు. కోర్టు తీర్పు వచ్చాకే హాస్టళ్లకు గుర్తింపు ప్రక్రియను చేపడతామని చెప్తున్నారు.
కరోనా నేపథ్యంలో ఇంటర్కాలేజీలకు గుర్తింపు ప్రక్రియలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ల అసోసియేషన్ (టీపీజేఎంఏ) కోరింది. ఎన్వోసీలు లేకుండా ఆటోరెన్యూవల్ ద్వారా గుర్తింపును ఏడాదిపాటు పొడగించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీశ్ ప్రభుత్వాన్ని కోరారు. తాజా పరిస్థితుల్లో కార్యాలయాల చుట్టూ తిరిగి ఎన్వోసీలు, సర్టిఫికెట్లను పొందడం సవాల్తో కూడుకున్న అంశమని, ఇప్పటికే చాలామంది కరోనా బారినపడి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.