హైదరాబాద్, ఆగస్టు 22 ( నమస్తే తెలంగాణ ): రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు పలువురు టీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీలు కట్టారు. ఆదివారం ప్రగతిభవన్లో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు సింధు ఆదర్శ్రెడ్డి, బొంతు శ్రీదేవి, మహిళాశిశు సంక్షేమశాఖ మాజీ రిజినల్ ఆర్గనైజర్ ముక్తవరం సుశీలారెడ్డి తదితరులు రాఖీ కట్టారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ సోదరి సౌమ్య తొలుత మంత్రి కేటీఆర్కు, తర్వాత సంతోష్కుమార్కు రాఖీ కట్టారు. సంతోష్కుమార్కు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి రాఖీ కట్టారు.