హైదరాబాద్: ఈ నెల 15న జరపాలని అనుకున్న తెలంగాణ విజయగర్జన సభను తెలంగాణ దీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు వరంగల్ సమావేశంలో చేసిన అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
నాటి ఉద్యమ రధసారథిగా ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ’ అనే నినాదంతో సీఎం కేసీఆర్ దీక్ష ప్రారంభించిన నవంబర్ 29 తేదీయే తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్కు విన్నవించారు. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను, తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి స్వరాష్ట్ర సాధనకు మూలమైన దీక్షా దివస్ రోజే జరపాలన్న వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేసీఆర్ తెలంగాణ విజయ గర్జన సభను నవంబర్ 29 వ తేదీకి వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో చారిత్రాత్మక తెలంగాణ విజయ గర్జన సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి ఇప్పటికే కమిటీలు వేసుకొని ముమ్మరంగా కృషిచేస్తూ ఏర్పాట్లల్లో నిమగ్నమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల టీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని గమనించాలని సీఎం తెలిపారు. ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను (ఈ నెల) నవంబర్ 29 వ తేదీకి మార్చుకోవాలని సూచించారు. తేదీ మార్పు విషయాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియచేయాలన్నారు.