హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైందని ఆయన మీడియాకు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకర పోస్టు చేసినందుకు గానూ ఎంపీ అరవింద్పై 504, 505(2), 153 ఐపీసీ, 67 ఐటీ యాక్ట్ 2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అసభ్యకర పోస్టులు, వీడియోలు పెట్టినందుకు గతేడాది డిసెంబర్ 31న వనస్థలిపురం ఏసీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఎంపీ అరవింద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీష్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… తప్పుడు ప్రచారం చేసే వారిని ఇకపై వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వారి ఆకృత్యాలను, విష ప్రచారాలను ఎండగడుతామన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు. సీఎం కేసీఆర్ ఫోటోను మార్ఫింగ్ చేసి, ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడమనేది ఒక ఎంపీ చేయాల్సిన పనులేనా…? అని ప్రశ్నించారు. పసుపు రైతుల ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇలాంటి చిల్లర పోస్టులను అరవింద్ పెడుతున్నాడని సతీశ్ రెడ్డి మండి పడ్డారు.
ఈ సందర్భంగా ఆయన బీజేపీ నాయకులకు ఒక విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంత మాత్రానా ఆ పార్టీ నాయకులు మేం చట్టాలకు, రాజ్యాంగానికీ అతీతులమని ఫీలవుతున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అగ్రనాయకుల తీరు చూస్తుంటే రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించేలా ఉన్నాయని… వారిని కట్టడి చెయ్యకపోతే తెలంగాణ శాంతి భద్రతలకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని అన్నారు సతీష్ రెడ్డి.