చెన్నూరు : మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంగళవారం టీఆర్ఎస్ శ్రేణులు భారీ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించాయి. బడ్జెట్లో చెన్నూరు భూములను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరందించే ‘చెన్నూరు లిఫ్ట్ స్కీమ్’కు త్వరలో టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిస్తామని సోమవారం అసెంబ్లీలో మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపు మేరకు పట్టణంలో కృతజ్ఞత ర్యాలీ తీశారు. పటాకులు కాలుస్తూ.. స్వీట్లు పంచి సంబురాలు జరిపారు. నియోజకవర్గంలోని చెన్నూరు, భీమారం, కోటపల్లి, జైపూర్, మందమర్రి, మండలాలు క్యాతనపల్లి, మందమర్రి, చెన్నూర్ మున్సిపాలిటీలకు చెందిన పార్టీ శ్రేణులు, రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని, కేసీఆర్ చిత్రానికి పాలాభిషేకం చేసి, ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే రైతాంగానికి రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, సకాలంలో ఎరువులు, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. ఇప్పుడు చెన్నూరు ఎత్తిపోతల ద్వారా బీడు భూములకు నిరంతరాయంగా సాగునీరందుతుందని ఆనందం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మద్దతుగా నిలుస్తామని నియోజకవర్గ రైతులు ముక్తకంఠంతో తెలిపారు. ఈ సందర్భంగా పథకం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్కు కృతజ్ఞతలు తెలిపారు.